ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Monday 31 December 2012

మంచి ర్యాంకు సాధించేదెలా? .. యండమూరి వీరేంద్రనాథ్ సూచనలు!



విద్యార్థులకు రానున్నది పరీక్షా సమయం! కోర్సును విజయవంతంగా పూర్తిచేయాలన్నా, ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశించాలన్నా, ఉద్యోగ నియామకం పొందాలన్నా రాతపరీక్షలకు సిద్ధం కావాల్సిందే! ప్రతిష్ఠాత్మకమైన సివిల్స్‌ సర్వీసుల వంటివి లక్ష్యంగా పెట్టుకునేవారు సుదీర్ఘకాలం పఠనం సాగించగలగాలి. మంచి మార్కులకైనా, మేటి ర్యాంకులకైనా శ్రద్ధగా చదవటం ముఖ్యం. ఈ సందర్భంగా విద్యార్థులు ఎదుర్కొనే వాస్తవ సమస్యలేమిటి? వాటిని తొలగించే ఆచరణాత్మక సూచనలేమిటి? 

ప్రసిద్ధ రచయితా, వ్యక్తిత్వ వికాస నిపుణుడూ యండమూరి వీరేంద్రనాథ్‌ అందిస్తున్న ప్రత్యేక కథనం!


విజయం సాధించడం అంటే కష్టపడటం కాదు. కొన్ని అయిష్టమైన విషయాల్ని ఇష్టాలుగా చేసుకోవడం!
ఒక విద్యార్థి చదువుకోవాలి. అదే సమయానికి టీవీలో సినిమా వస్తూంది. సినిమా ఇష్టం. చదువు అయిష్టం! అయిష్టాన్ని ఇష్టం చేసుకోవటం కష్టమయినపుడు చదువు కష్టమవుతుంది.

పొద్దున్న ఎనిమిదింటికి లేవడంకన్నా ఆరింటికి లేచి వాకింగ్‌ చేస్తే బావుంటుంది. ఆ విషయం తెలుసుకోవడమే విజయం! అప్పుడు... చేస్తున్న పనే గొప్ప తృప్తిని కలిగిస్తుంది. అప్పుడిక 'విజయం' కష్టం అవదు. ఇష్టం అవుతుంది.

తెలివీ... మార్కులూ
తెలివైన విద్యార్థి తగినంత ప్రయత్నం చేయక మంచి మార్కులు పొందకపోవచ్చు. అలాగే మంచి మార్కులు సాధిస్తున్న విద్యార్థి తెలివైనవాడు కాకపోవచ్చు; కేవలం కష్టపడి చదివేవాడైవుండొచ్చు.

గణితం, అకౌంట్స్‌ చదవాలంటే తెలివితేటలుండాలి. జంతుశాస్త్రం, మెడిసిన్‌ చదవటానికి కృషి, జ్ఞాపకశక్తి అవసరం. ఈ చిన్నపాటి వాస్తవం గుర్తించక చాలామంది విద్యార్థులు తాము ఏ రంగాల్లో పైకొస్తారో గ్రహించక వేరే ఆకర్షణీయమైన కోర్సులను ఎంచుకుంటుంటారు.

వాయిదా పద్ధతుంది...
చివరి నిమిషం దాకా చదవటం వాయిదా వేసేవారుంటారు. ఈ academic procrastinators 'సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నా'మంటూ సాకులు చెప్తుంటారు. ఇలాంటివారికి గది శుభ్రంగా లేదనే చిన్న కారణం చాలు, పుస్తకం పక్కన పడెయ్యటానికి!

ఇలాంటి వాయిదా మనస్తత్వాన్ని తొలగించుకోవటానికి కొన్ని కిటుకులు:

* ప్రతిభావంతుల సాహచర్యంలో ఉండండి. మీ రంగంలో అత్యుత్తమ ప్రతిభ చూపినవారిని గమనిస్తూ వారికి ప్రేరణ ఎలా వస్తోందో అవగాహన చేసుకోండి.

* విజయం రుచి తెలిస్తే బద్ధకం పారిపోతుంది. ఒక ఫస్ట్‌ ర్యాంకర్‌ తన స్థాయిని ఎలా నిలబెట్టుకుంటాడంటే... ఉపాధ్యాయుల అభినందనలతో, తల్లి మౌన ప్రశంసతో, తండ్రిలో కనపడే I am proud of youభావంతో!

* ఒక సబ్జెక్టును చదివాక, కాస్త విరామం తీసుకుని మరో సబ్జెక్టుకు మారటం వల్ల చాలా తాజాగా ఉండొచ్చు. చదవటం విసుగనిపిస్తే రాయండి. చరిత్రతో విసిగిపోతే దాన్ని మార్చి, గణితం సాధన మొదలుపెట్టండి (గ్రూప్స్‌, సివిల్‌ సర్వీసెస్‌ అభ్యర్థులు).

ఆహ్లాదకర వాతావరణం
ఆహ్లాదకరమైన వాతావరణం అలసటను తగ్గించేస్తుంది. మన జ్ఞానేంద్రియాలు సౌకర్యంగా ఉన్నపుడు మనం మరింత విశ్రాంతి అనిపిస్తుంది. అందుకే...

కళ్ళు: టేబుల్‌ లైట్‌ కింద చదవండి. ఆకలి లేకపోయినా వంట గదిలోకి వెళ్ళటం, లేకపోతే 'కొద్ది నిమిషాలు' టీవీ చూడటం (అది అక్కడితో ఆగదు) వద్దు. మరింత విశ్రాంతి కావాలంటే... చదివే గదిలో ప్రపంచ పటం పెట్టుకుని ఆసక్తికరమైన ప్రదేశాలూ, నదులూ, దేశాలను పరిశీలిస్తుండండి.

సువాసన: దుర్గంధం వెదజల్లే డ్రెయినేజి దగ్గర కూర్చుని మీరు చదవలేరు. మల్లెల వాసన నిద్రమత్తు ప్రభావాన్ని కలిగిస్తుంది. వాసన మనసుపై ప్రభావం చూపిస్తుంది. నా అనుభవంలో సాంబ్రాణి పుల్ల వెలిగిస్తే అది మెరుగైన మనఃస్థితి (మూడ్‌)ని సృష్టిస్తుంది. దేవాలయ ప్రాంగణంలోని సుగంధం దీనికో ఉదాహరణ.

ఆహారం: రాత్రుళ్ళు చదవదల్చుకున్నపుడు అరటిపళ్ళు, మిఠాయిలు, జంక్‌ ఫూడ్‌, చికెన్‌ తినకూడదు. ఇవి మెదడునుంచి ఆక్సిజన్‌ను జీర్ణవ్యవస్థకు దారి మళ్ళించి నిద్ర కలగజేస్తాయి.

ప్రార్థన: చదవటం మొదలుపెట్టేముందు కొద్దినిమిషాలు కదలకుండా నిలబడాలి. దీన్ని 'మెదడును శుభ్రపరుచుకోవటం' అనొచ్చు. బయటి శబ్దాలు ఇబ్బందిపెడుతుంటే చెవుల్లో దూది/ ఇయర్‌ ప్లగ్స్‌ పెట్టుకోండి. చదివేటపుడు సంగీతం వినకపోతే మంచిది. ఒకే సంగీతవాద్యం నుంచి వచ్చే మృదువైన సంగీతం పర్వాలేదు. సాహిత్యంతో ఉన్న పాటలు అసలు వద్దు.

వాతావరణం: అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకోండి. గజిబిజి లేని మనసుతో చదువు కొనసాగించండి. అమితాబ్‌, ఐశ్వర్యలను మీరు గుర్తుపెట్టుకోగలిగినపుడు ఆర్కిమెడిస్‌నూ, పైథాగరస్‌నూ కూడా జ్ఞాపకం తెచ్చుకోగలరు!


యాబైశాతం సన్నద్ధత
మెరుగ్గా చదివే అలవాట్లను పెంచుకుంటే సగం సన్నద్ధత పూర్తయినట్టే!
* స్టడీ టేబుల్‌/చాప దగ్గర కొద్ది క్షణాలు నిలబడాలి. కళ్ళు మూసుకుని, ఏమీ ఆలోచించకుండా ఉండటానికి ప్రయత్నించాలి. ఒక కరాటే ఆటగాడు విన్యాసాలకు ముందు మానసికంగా ఎలా సన్నద్ధమవుతాడో.. అలాగన్నమాట! మెదడు అనే పలకను శుభ్రం చేయటం లాంటిదిది. మొదట్లో ఇది ఆచరణకు అనుకూలం కాదనిపిస్తుంది. ఓపికను పరీక్షిస్తుంది. దీన్ని మూడు నాలుగు వారాలు సాధన చేస్తే, చక్కని ఫలితాలు ఉంటాయి.

* రాత్రివేళ మీ రీడింగ్‌ టేబుల్‌ దగ్గర అవసరమైన అన్ని వస్తువులూ... పుస్తకాలు, నీళ్ళు లాంటివి పెట్టుకోవాలి. లేకపోతే వీటికోసం వెతకటానికి విలువైన మీ ప్రభాత సమయం వృథా అవుతుంది.

* చదివేటపుడు గది తలుపులు మూసివేయండి. ఏకాగ్రత తగ్గినపుడు పుస్తకంకేసి చూస్తూ అలాగే ఉండిపోకుండా, పుస్తకాన్ని పక్కన పెట్టండి. తాజా గాలి పీల్చుకుని, గదిలోనే పచార్లు చేయండి... చదవటమే ఈ పచార్లకంటే మెరుగనిపించేదాకా!

* ఏదో ఒక సాకుతో చదువుకోవటం వాయిదా వేయాలనే కోరిక సగటు విద్యార్థిలో సాధారణంగా కనిపించే ధోరణి. అందుకే ఆసక్తికరమైన సబ్జెక్టుతో ప్రారంభించి నిస్సారంగా తోచే సబ్జెక్టును ఆ తర్వాత చదవండి. నాన్‌ డీటెయిల్డ్‌ కథతో మొదలుపెట్టి, కష్టమైన సబ్జెక్టులోకి వెళ్ళటంలాంటిది ఇది. చదవటం విసుగనిపిస్తే రాయండి. లేకపోతే గణితం సాధన చేయండి. రెండు ఆసక్తికరమైన సబ్జెక్టుల మధ్య ఒక అనాసక్తికరమైన సబ్జెక్టును చదవటం మంచిది.

* కష్టమైన కెమిస్ట్రీ ఫార్ములాలూ, ఫిజిక్స్‌ సూత్రాలూ గోడమీద అంటించుకోండి. (ఇతర సబ్జెక్టులవారు ఆ సబ్జెక్టులకు సంబంధించినవి). వాటిని అప్రయత్నంగానే గమనిస్తుంటారు కదా? కొద్దిరోజలుకే మీకు తెలియకుండానే అవన్నీ మీకు వచ్చేసినట్టు గ్రహించి ఆశ్చర్యపోతారు. ప్రపంచ పటాన్నో, దేశ/రాష్ట్ర పటాన్నో గోడకు వేలాడదీయండి. విశ్రాంతి తీసుకోవటానికి (రిలాక్స్‌) మ్యాపులను పరిశీలించటం ఓ చక్కని చిట్కా.

* ఆ రోజుకు చదవాల్సింది పూర్తిచేసినపుడు మీకు మీరే ఓ కానుక ఇచ్చుకోండి. ఉదా: 'ఈరోజు దీన్ని చదవటం పూర్తిచేస్తే రేపు సినిమాకు వెళ్తాను'.... ఇలా. ఎలాంటి పెండింగ్‌ లేకుండా, చదివే పోర్షన్‌ని పూర్తిచేసినప్పుడు... ఆ భావంతో నిద్రపోవటం ఎంత ఉల్లాసంగా ఉంటుందో మీరే వూహించుకోండి.

* విద్యార్థులు ఎక్కువ సమయాన్ని తమకిష్టమైన సబ్జెక్టులు చదవటానికే కేటాయిస్తుంటారు. తాము కష్టంగా భావించేవాటికి కాదు. ఈ ధోరణి మార్చుకోవాలి. కష్టమైన సబ్జెక్టులకే ఎక్కువ సమయం కేటాయించాలి.

* కేవలం చదువుకోవటానికి ఒక నిర్దిష్ట ప్రదేశం పెట్టుకోండి. కొంతకాలానికి చదవటం మీ స్వభావంలో భాగమైపోతుంది. మీరెప్పుడు ఆ ప్రదేశంలో కూర్చున్నా నేరుగా చదువులోకి ప్రవేశించగలుగుతారు.

* గ్రంథాలయాల్లోనూ, ఒంటరిగానూ చదివే అలవాటు పెంచుకోండి. పోచుకోలు కబుర్లకు అవకాశమున్న కంబైన్డ్‌ స్టడీ అంత ఉపయోగకరం కాదు.

* ఒక సబ్జెక్టును పూర్తిచేశాక, వెంటనే మరోటి మొదలుపెట్టొద్దు. ఐదు నిమిషాల విరామం ఇవ్వండి. దీన్ని 'మైండ్‌ హాలీడే' అంటారు.

* సబ్జెక్టులో సందేహాలు వస్తే వెంటనే తీర్చుకోవాలి. చిన్న అనుమానమే ముందుకు వెళ్తున్నకొద్దీ పెద్దసమస్యగా పరిణమించవచ్చు.

* ప్రతిరోజూ పుస్తకాలు చదవండి. సెలవు రోజు కూడా. సెలవులకు మీ తాతగారి వూరికి వెళ్ళినపుడు కూడా. కనీసం అరగంటైనా చదవాలి. ఇలా చేస్తే చదవటం మీ అభిరుచిగా మారుతుంది. అలాంటపుడు పరీక్షల ముందు గంటలకొద్దీ- విరామం లేకుండా చదివే అవసరం రాదు.


ఏం చదివినా గుర్తుండటం లేదా? 
సమయం సరిపోదు.. ఎందుకని? 
ఏకాగ్రత కుదరటం లేదా? ...

www.eenadu.net లో చదువు విభాగం  చూడండి.

Monday 17 December 2012

మార్పులకు తగ్గ వ్యూహం!


గ్రూప్‌-2 కార్యనిర్వాహక పోస్టులను గ్రూప్‌-1లో విలీనం చేయాలనే ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో ఉద్యోగార్థులకు కొత్త సవాలు ఎదురయింది. రెండు పరీక్షలు రాయాల్సిరావటమే కాదు; ప్రధాన పరీక్ష లక్ష్యాత్మక (ఆబ్జెక్టివ్‌) పద్ధతి నుంచి వివరణాత్మక (డిస్క్రిప్టివ్‌) విధానంలోకి మారిపోయింది. ఈ మార్పులకు తగిన వ్యూహం రూపొందించుకోవటం తక్షణ కర్తవ్యం!
ప్పటివరకూ గ్రూప్‌-1 సర్వీసులుగా గుర్తిస్తున్నవాటిని గ్రూప్‌-1 (ఎ)గా; గ్రూప్‌-2 సర్వీసులుగా గుర్తిస్తున్నవాటిని గ్రూప్‌-1 (బి)గా మారుస్తున్నట్లు (జీవో ఎంఎస్‌ నంబర్‌ 622) ప్రభుత్వం ప్రకటించింది. దీంతో గ్రూప్‌-1 రాతపరీక్ష ద్వారా ఎంపిక జరిగే ఉద్యోగాల పరిధి బాగా విస్తృతమయింది. కానీ ఇప్పటివరకూ గ్రూప్‌-2పై ఆశలు పెట్టుకున్న అభ్యర్థులు డీలా పడ్డారు.మారిన పరిస్థితులకు అనుగుణంగా సన్నద్ధత వ్యూహాన్ని మార్చుకోవాలంటే ఈ పరీక్షల స్వరూపాన్ని అవగాహన చేసుకోవాలి.ఏ రకమైన డిగ్రీ అయినా శ్రేణి, శాతంతో నిమిత్తం లేకుండా ఉత్తీర్ణులైతే దరఖాస్తుకు అర్హులే.

కొత్త అభ్యర్థులు
గత పరీక్షానుభవం లేకపోయినా కొత్త అభ్యర్థులు ప్రతి నోటిఫికేషన్లోనూ భారీ సంఖ్యలో పోటీపడుతున్నారు. 2008, 2011 నోటిఫికేషన్లలో తొలిసారే పరీక్ష రాసినప్పటికీ 50 శాతానికి పైగా ఉద్యోగాలను వారే సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ప్రస్తుత పరీక్షా విధానం, మారుతున్న ప్రశ్నల ధోరణి సీనియర్‌, జూనియర్‌ల మధ్య పెద్ద తేడాను సృష్టించటం లేదు. అందువల్ల కొత్త అభ్యర్థులు సైతం గ్రూప్‌-1 ఉద్యోగానికి ధీమాగా ప్రయత్నించొచ్చు.
* సన్నద్ధత సమయంలో 2/3 వంతు సమయాన్ని ప్రిలిమినరీకి కేటాయించాలి. పరీక్షకు నెలరోజుల ముందునుంచీ 100 శాతం సమయం ప్రిలిమినరీకి కేటాయించాలి.

* ఇప్పుడే ప్రిపరేషన్‌ ప్రారంభిస్తే మిగిలిన 1/3 వంతు సమయాన్ని మెయిన్స్‌లో కనీసం 3 పేపర్లకు కేటాయించాలి.

* 'ప్రిలిమ్స్‌తో పాటు మెయిన్స్‌ సన్నద్ధత' ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరిగా అనుసరణీయం.

* బీటెక్‌/ గణిత నేపథ్యం ఉన్నవారు పేపర్‌-1,2,3,4 లను ఇప్పటినుంచే ప్రిలిమినరీతో కలిపి చదవటం మంచిది.

* ఆర్ట్స్‌ నేపథ్యమున్న అభ్యర్థులు పేపర్‌-1,4,5లపై బాగా దృష్టి పెట్టవచ్చు.

* ముఖ్యంగా వ్యాసరచన (పేపర్‌-1) కృషిని ఇప్పటినుంచే మొదలుపెడితే మిగిలిన పేపర్లలో వ్యాస సంబంధిత అంశాలను ఎలా అనుసంధానించుకోవచ్చో అర్థమవుతుంది. ఫలితంగా గ్రూప్‌-1 స్థాయికి తగిన భావనల పునాది ఏర్పడి 250-300/750 మార్కులకు సిద్ధమైనట్లే!

గ్రూప్‌-2 నుంచి గ్రూప్‌-1కి మారేందుకు మెలకువలు
* గ్రూప్‌-2 ప్రిపరేషన్లో భాగంగా జనరల్‌స్టడీస్‌ (పేపర్‌-1) చదివేవుంటారు కాబట్టి ప్రస్తుతం ప్రిలిమినరీ గురించి ఆలోచించవద్దు. ఈ పరీక్షకు 45 రోజుల ముందునుంచి చదివితే సరిపోతుంది.

* ప్రస్తుత సమయాన్ని మెయిన్స్‌ సన్నద్ధతకు వినియోగించండి.

* ఏ తరహా ప్రశ్నలు వస్తున్నాయో గమనిస్తే ప్రిపరేషన్‌ని ఎలా కొనసాగించాలో దిశానిర్దేశం ఏర్పడుతుంది. అందుకే 2008, 2011, 2012 సంవత్సరాల ప్రశ్నపత్రాలను ఒకసారి పరిశీలించండి.

* మెయిన్స్‌ 2,3,4 పేపర్లలోని ఒక మార్కు ప్రశ్నలు, సంక్షిప్త సమాధాన (2,3,4 మార్కుల) ప్రశ్నలను గ్రూప్‌-2 స్థాయిలో తయారైన అంశాల ద్వారా ఎదుర్కోవచ్చు. ఇలాంటి వ్యూహంతో విజయానికి కావాల్సిన 65 శాతంలో 30 శాతం మార్కులు సాధించవచ్చని గమనించాలి.
ఉదా:
1. భారతదేశ దేవాలయ నిర్మాణ శైలికి ఉదాహరణలు?
2. భారతదేశ ఎన్నికల సంఘ అధికారాలు, విధులు?
3. సంస్కరణల అమలు అనంతరం ప్రత్యక్ష, పరోక్ష పన్నుల సాపేక్ష వాటాలు
4. ఏపీ చిన్నతరహా పరిశ్రమల సమస్యలు
5. టెలి మెడిసిన్‌ అంటే?
6. కార్డోశాట్‌-2 రిజల్యూషన్‌ ఎంత?
7. అణుశక్తి నిర్వచనం
8. సామాజిక అడవులు- ఉపయోగం

* మెయిన్స్‌లో అనేక ప్రశ్నలకు సరైన జవాబులు రాయాలంటే ప్రాథమికాంశాలు (బేసిక్స్‌) తెలిసుండాలి. వీటిపై పట్టున్న అభ్యర్థులే గతంలో కూడా రాణించారు. ఇప్పటివరకూ గ్రూప్‌-2 కోసం సిద్ధమైన ప్రాథమికాంశాలు ఇక్కడ బాగా ఉపయోగపడతాయి.

గ్రూప్‌-1 సీనియర్‌ అభ్యర్థులు
* గతంలో కూడా చాలామంది సీనియర్‌ అభ్యర్థులు ప్రిలిమినరీ కూడా పాసవని సందర్భాలున్నాయి. గ్రూప్‌-2 వారు 'ప్రాక్టీస్‌' కోసం ప్రిలిమినరీ రాయటం కూడా ఇలాంటి పరిస్థితికి కారణం. గత గ్రూప్‌-2 అభ్యర్థులు ఇప్పుడు శ్రద్ధగా గ్రూప్‌-1 రాస్తారు కాబట్టి ప్రిలిమినరీ గట్టెక్కటం మరింత క్లిష్టంగా మారనుంది. అందుకు తగిన రీతిలో సిద్ధపడాలి.

* మెయిన్స్‌లో చేసిన తప్పిదాలను గతానుభవాలతో సరిదిద్దుకునే అవకాశం ఇప్పుడు వస్తోంది. ప్రిలిమినరీకి రోజూ 2 గంటల సమయం కేటాయించి మెయిన్స్‌పై శ్రద్ధ పెట్టండి.

గ్రూప్‌-1 ఉద్యోగార్థులందరికీ...
* ప్రతిరోజూ వార్తాపత్రికల అధ్యయనం గ్రూప్‌-1లో రాణించేందుకు బాగా ఉపయోగపడుతుంది. 2012 గ్రూప్‌-1లో దినపత్రికల అధ్యయనం ద్వారా దాదాపు 280 మార్కులకు జవాబులు రాయగల్గిన పరిస్థితి ఏర్పడింది.

* సమాధానాలను సంక్షిప్తీకరించటం/ విపులీకరించటం చేయగల సామర్థ్యాలున్నవారు ఎగ్జామినర్లను మెప్పించగలుగుతున్నారు. తద్వారా ఎక్కువ మార్కులు పొందగలుగుతున్నారు.

* ప్రశ్నకు కేటాయించిన మార్కులను బట్టి సమయం కేటాయింపు ఉండాలి. పేపర్‌-2,3,4లలో సమయం చాలని సమస్య ఎదురవుతోంది. వీలైనన్ని నమూనా ప్రశ్నలను సమయ నియంత్రణతో రాయటం ఇప్పటినుంచే అలవాటు చేసుకోవాలి.

* చాలామంది జిరాక్స్‌ నోట్సులూ, కోచింగ్‌ నోట్సులూ బట్టీ పడుతున్నారు. ప్రశ్న తీరు మారగానే జవాబు రాయలేకపోతున్నారు. సిలబస్‌లో ప్రతి అంశాన్నీ సమాజానికి అన్వయించటం, దాన్ని సమాధానంలో పొందుపర్చటం ముఖ్యం.

* ఒక పేపర్‌ ముఖ్యం, మరోటి అంత ముఖ్యం కాదు- ఇలాంటి భావనలు పెంచుకోకుండా అన్ని పేపర్లలోనూ సగటు మార్కుల కంటే కనీసం 5 మార్కులు (ఒక్కో పేపర్‌లో) తెచ్చుకుంటే విజయం తథ్యం!


స్త్థెర్యంతో సాగాలి

గ్రూప్‌-2 పరీక్షకు మాత్రమే సిద్ధమయ్యే అభ్యర్థులు గ్రూప్‌-1 అభ్యర్థులతో సమానంగా పోటీపడలేమనీ, గ్రూప్‌-2లోని ఎగ్జిక్యూటివ్‌ పోస్టులన్నీ గ్రూప్‌-1 అభ్యర్థులే దక్కించుకుంటారనీ భయపడుతున్నారు. ఇది వాస్తవమే. కానీ పరీక్షకు ఇంకా చాలా సమయం ఉన్నందున ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా తయారై, గ్రూప్‌-1 పోస్టులనే సాధించగలమనే స్త్థెర్యంతో ముందుకు సాగితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

గ్రూప్‌-2 అభ్యర్థులంతా పరీక్షా పద్ధతి ఎలా ఉన్నా ముందుగా పాత పద్ధతిలోని మూడు పేపర్లకు సంబంధించిన సబ్జెక్టులన్నిటినీ సమగ్రంగా అధ్యయనం చేయాలి. దీంతో వారు గ్రూప్‌-2 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పరీక్షను విజయవంతంగా రాయగలుగుతారు. ఆ తర్వాత ఇదే ప్రిపరేషన్‌తో సాధించిన పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ, క్రమం తప్పకుండా రాయటం సాధన చేస్తే గ్రూప్‌-1 (ఎ) పోస్టు గానీ, గ్రూప్‌-1 (బి) పోస్టు గానీ సాధించే వీలుంటుంది.

వెయ్యి పోస్టులు
ఏపీపీఎస్‌సీ గత నోటిఫికేషన్లను గమనిస్తే గ్రూప్‌-1 పోస్టులు 300 ఉంటే గ్రూప్‌-2 కార్యనిర్వాహక పోస్టులు 600కు పైగా ఉంటాయి. అంటే ఒకేసారి, ఒకే పరీక్ష ద్వారా దాదాపు వెయ్యి పోస్టులకు పోటీ పడే అవకాశం! సరైన పంథాలో సిద్ధమైతే తప్పకుండా ఉద్యోగం సాధించవచ్చు.

అంతే కాకుండా గ్రూప్‌-2 ఉద్యోగాలను ఆశించే అభ్యర్థులు పరీక్షలో మెరుగైన ప్రతిభ చూపితే గ్రూప్‌-1 పోస్టు పొందే అవకాశమూ ఉంటుంది. అంటే ఆశించినదానికంటే ఎన్నో రెట్లు అధిక ఫలితం సాధించే వీలు!


గ్రూప్‌-1 సన్నద్ధత అంటే ఆల్‌ఇన్‌వన్‌
ప్రణాళికాబద్ధంగా గ్రూప్‌-1 పరీక్షకు సన్నద్ధమైతే ఆల్‌ ఇన్‌ వన్‌ లాగా గ్రూప్‌-1 (ఎ), గ్రూప్‌-1 (బి), గ్రూప్‌-2 పరీక్షలన్నిటికీ సిద్ధమవుతున్నట్లే! ఎందుకంటే- ఇప్పుడు మార్చిన పద్ధతి ప్రకారం గ్రూప్‌-2 పరీక్ష నాన్‌ ఎగ్జిక్యూటివ్‌లోని మూడు పేపర్లకు నిర్దేశించిన సిలబస్‌ మొత్తం గ్రూప్‌-1 (ఎ), (బి) పరీక్షకు సంబంధించిన మెయిన్‌ పరీక్షలో ఉంటుంది. అందుకే సిలబస్‌లోని సబ్జెక్టులను క్షుణ్ణంగా చదవాలి. ముఖ్యంగా ఆంధ్రుల చరిత్ర, భారత రాజ్యాంగం, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థలపై పట్టు సాధించవలసిందే!

మెయిన్‌ పరీక్షలో 15 ప్రశ్నలకు సమగ్రమైన సమాధానాలను మూడు గంటల్లో రాయాల్సివుంటుంది. అందుకని ఇప్పటినుంచే రాయటం సాధన చేయాల్సివుంటుంది. గంటకు వెయ్యి పదాల చొప్పున 3 గంటల్లో 3,000 పదాలు రాయాలి.పద్ధతి కొత్తదైనా, పాతదైనా సాగించాల్సిన ప్రిపరేషన్‌ తీరు ఒకటే. పటిష్ఠమైన ప్రణాళిక, పట్టుదల, కృషి. వీటికి ఆత్మస్త్థెర్యం, ఉత్తమ మార్గదర్శకత్వం తోడైతే లక్ష్యం నెరవేరటంలో సందేహమే ఉండదు.

Monday 10 December 2012

'నీట్‌' పరీక్షలో గెలుపు సులువే!





మార్పు అనివార్యమైనపుడు దానికి తగ్గట్టుగా మనల్ని మల్చుకోకతప్పదు. సానుకూలవైఖరితో ముందడుగు వేస్తేనే సత్ఫలితాలు వస్తాయి. 2013లో సీనియర్‌ ఇంటర్‌ పరీక్షలకు హాజరయ్యే ఎం.పి.సి., బై.పి.సి. విద్యార్థులకు జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో పూర్తిమార్పులు చోటు చేసుకున్నాయి. ఎం.పి.సి. విద్యార్థులకు జేఈఈ- మెయిన్స్‌ మాదిరిగానే బై.పి.సి. వారికి 'నీట్‌' రాయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ మార్పును తల్చుకుని బెంబేలుపడకుండా మంచి ర్యాంకు సాధనకు దీక్షతో సమాయత్తం కావాలి!


ఆంధ్రప్రదేశ్‌లోని 14 ప్రభుత్వ, 25 ప్రైవేట్‌ మెడికల్‌ కళాశాలల్లో 5600 మెడికల్‌ సీట్లూ; మూడు ప్రభుత్వ, 18 ప్రయివేట్‌ డెంటల్‌ కళాశాలల్లో 1790 సీట్లూ ఉన్నాయి. అంటే మెడికల్‌, బీడీఎస్‌లతో కలిపి 7390 సీట్లను ఈ విద్యాసంవత్సరం నుంచి 'నీట్‌'లో వచ్చిన ర్యాంకు ఆధారంగా కేటాయిస్తారన్నమాట.
అయితే ఇప్పటికీ చాలామంది 'నీట్‌ ఉందా? ఎంసెట్‌ ఉందా? లేదా రెండూ ఉన్నాయా?' అనే సందిగ్ధంలో ఉన్నారు. రెండు పరీక్షలు జరిపే అవకాశమే లేదు. సుప్రీంకోర్టు తీర్పుననుసరించి ఒకే పరీక్ష ఉంటుంది. అయితే అది 'నీట్‌' అవడానికే అవకాశం ఎక్కువ!

ఎందువల్లనంటే- మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా 2010లోనే దేశంలోని మెడికల్‌ కళాశాలలన్నిటికీ ఒకే ప్రవేశపరీక్ష జరగాలని ఒక స్పెషల్‌ గెజిట్‌ విడుదల చేసింది. (గెజిట్‌ నెం. MCI-31(1)/2010_Med/49068, dated 21.12.2010). దాన్ని అనుసరించి 2012లోనే ఉమ్మడి జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష నిర్వహించవలసిన అవసరం ఏర్పడింది.

అయితే వివిధ రాష్ట్రాలు 2012లో విద్యార్థులు సంసిద్ధం తయారుకాలేరని అభ్యంతరం చెప్పటం, కొన్ని సాంకేతిక కారణాల వల్లా మళ్ళీ ఒక స్పెషల్‌ గెజిట్‌ విడుదల చేశారు. పరీక్షను 2013 నుంచి జరుపుతామని నిర్ణయించారు. (గెజిట్‌ నెం.MCI-31(1)/2010_Med/62051, dated 15.02.2012). ఈ రెండు గెజిట్‌ల ఆధారంగా మెడికల్‌ కౌన్సిల్‌ 2013లో ప్రవేశపరీక్ష జరిపే దిశలో విధివిధానాలతో నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఈ నేపథ్యంలో పరీక్ష జరగడానికే అవకాశాలు అధికం. పరీక్ష తెలుగులో జరుగుతుంది కాబట్టి తెలుగు మీడియం విద్యార్థులు కూడా ఎటువంటి మానసిక ఒత్తిడీ లేకుండా పరీక్షకు తయారుకావచ్చు.

ఈ పరీక్షకు సంబంధించి కొన్ని ముఖ్యమైన తేదీలు తెలుసుకుంటే వాటినుంచి తయారీ విధానం గురించి ఆలోచించుకోవచ్చు.

 ఆన్‌లైన్‌ దరఖాస్తు
ఈ పరీక్షకు డిసెంబర్‌ 31వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు భర్తీ చేయాలి. దీనికోసం www.cbseneet.nic.inఅనే వెబ్‌పేజీని ఓపెన్‌ చేసి మొదటగా నమూనా దరఖాస్తును ప్రింట్‌ తీసుకోవాలి. దాన్ని నింపి, దాని ఆధారంగా మళ్ళీ ఆన్‌లైన్‌లో భర్తీ చేస్తే తప్పులు చేసే అవకాశం ఉండదు.

నిర్ణీత ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు భర్తీ చేసిన తర్వాత దాన్ని A5 పేపరుపై ప్రింటు తీసుకోవాలి. వీటిని మూడు నుంచి ఐదు కాపీల వరకు ప్రింటు తీసుకొని వాటిపై ఫొటోగ్రాఫ్‌ అంటించి అటెస్టేషన్‌ చేయించాలి. ఫొటోగ్రాఫు నవంబరు ఒకటో తర్వాత తీసినదై ఉండాలి. ఫొటోగ్రాఫ్‌ కింద విద్యార్థిపేరు, ఫొటోతీసిన తేదీ ప్రింటు అయి ఉండాలి. ఆ ఫొటోగ్రాఫ్‌ని అంటించిన తర్వాత సంబంధిత కాలేజీ ప్రిన్సిపల్‌/ గెజిటెడ్‌ ఆఫీసర్‌ చేత దానిపై సంతకం చేయించాలి. మిగిలిన సంతకాలు కూడా పూర్తిచేసి CBSE ఆఫీస్‌కు పంపించవలసి ఉంటుంది. ముందుగా ఈ దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేస్తే ఇక పూర్తిగా పరీక్షకు తయారయ్యే విధానంపైనే దృష్టి సారించవచ్చు.





సంసిద్ధమయ్యే విధమెలా?
ఎంసెట్‌కూ, నీట్‌కూ ఉన్న తేడాలు గమనించాలి. ఎంసెట్‌లో 160 ప్రశ్నలకు మాత్రమే జవాబులు గుర్తించవలసి ఉంటుంది. నీట్‌లో 180 ప్రశ్నలుంటాయి. ఈ 180 ప్రశ్నలు మూడు సమవిభాగాలుగా ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీల్లో 60 ప్రశ్నల చొప్పున ఉంటాయా లేదా బయాలజీ (బోటనీ + జువాలజీ) 90 ప్రశ్నలు, ఫిజిక్స్‌ 45, కెమిస్ట్రీ 45 ప్రశ్నలు ఉంటాయా అనేది ఇంతవరకు వివరణ ఇవ్వలేదు. అయితే CBSE PMT పరీక్షలో 200 ప్రశ్నలు (50X4) ఉంటున్నాయి కాబట్టి 45 X4 అంటే బోటనీ 45, జువాలజీ 45, ఫిజిక్స్‌ 45, కెమిస్ట్రీ 45 ప్రశ్నలు ఉండే అవకాశం ఎక్కువ.
ఎంసెట్‌ కంటే అదనంగా 20 ప్రశ్నలు పెరుగుతున్నందున పరీక్షలో వేగం కొంత పెంచుకోవాలి. అయితే జాతీయస్థాయి పరీక్షల్లో మనరాష్ట్ర ఎంసెట్‌ కంటే భౌతిక, రసాయనశాస్త్ర పేపర్లు సులభంగా ఉంటున్నాయి కాబట్టి పెద్దగా ఒత్తిడికి గురవ్వాల్సిన అవసరం లేదు.

రుణాత్మక మార్కులపై మన రాష్ట్ర విద్యార్థులకు అభ్యాసం లేదు కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోవాలి. జవాబు గుర్తించేటప్పుడు తెలియని ప్రశ్నలకు జవాబులు వదిలివేయడం మేలు. లేదా నాలుగు సమాధానాలను స్పష్టంగా చదివి; కనీసం రెండు జవాబులు ఆ ప్రశ్నకు వర్తించవని భావిస్తే మిగిలిన రెండింట్లో ఒకదాన్ని గుర్తించడానికి ఛాన్స్‌ తీసుకోవచ్చు. అంతేకానీ ఏమీ తెలియకుండా జవాబు గుర్తించడం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదు.

1) రుణాత్మక మార్కులు ఉన్నాయి 2) ప్రశ్నల సంఖ్య పెరిగింది. ఈ రెండు అంశాలనూ అధిగమించాలంటే ఎక్కువసార్లు పునశ్చరణ చేయాల్సిందే. వీలైనన్ని ఎక్కువ నమూనా పరీక్షలు రాయాలి.

సిలబస్‌లో వ్యత్యాసాలు
మన విద్యార్థుల పరంగా చూస్తే- నీట్‌లో ఫిజిక్స్‌, కెమిస్ట్రీలలో దాదాపు తేడా లేదనే చెప్పాలి. కానీ జీవశాస్త్రం (బయాలజీ)లో వ్యత్యాసం చాలా ఉంది. జాగ్రత్తపడవలసిన ఓ అంశం- ప్రతి సబ్జెక్టులోనూ కటాఫ్‌ మార్కు సాధిస్తేనే ర్యాంకు పొందే అవకాశం ఉండటం.

మన ఎంసెట్‌లో సీటు సాధించడానికి ఇటువంటి కనీసమార్కు లేదు కాబట్టి బయాలజీ, కెమిస్ట్రీ చదువుకొని కూడా ర్యాంకు సాధించగల్గుతున్నారు. అంటే బయాలజీలో 75 మార్కులు, కెమిస్ట్రీలో 35 మార్కులు సాధించి ఫిజిక్స్‌లో 2 లేదా 3 మార్కులు సాధించినవారు కూడా మెడికల్‌లో చేరే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు ప్రతి సబ్జెక్టులోనూ కటాఫ్‌ మార్కు సాధించాలి కాబట్టి మూడు సబ్జెక్టులకూ సమప్రాధాన్యం ఇచ్చి తయారుకావాలి.

మన రాష్ట్రవిద్యార్థులకు సీట్ల కేటాయింపు
ఆంధ్రప్రదేశ్‌, జమ్ము కాశ్మీర్‌ విద్యార్థులు నేషనల్‌పూల్‌లో లేరు కాబట్టి ఈ రాష్ట్రాల్లో నూరు శాతం సీట్లు అదే రాష్ట్ర విద్యార్థులతోనే నింపుతారు. అంటే ఎంసెట్‌ స్థానంలో నీట్‌ జరుగుతుంది. సీట్లు నింపే పద్ధతీ, సీట్ల సంఖ్యా గతంలో మాదిరే ఉంటుంది. అయితే మన రాష్ట్రవిద్యార్థులు ఇతర డీమ్డ్‌ యూనివర్సిటీల్లోనూ, ఇతర రాష్ట్రాల్లోని ప్రయివేట్‌ కళాశాలలో కేటగిరి-సి సీట్లనూ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి అదనంగా 300 వరకూ సీట్లు లభ్యం అవుతాయి.

'నీట్‌' మన రాష్ట్రంలో హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు- ఈ ఐదు కేంద్రాల్లో మే 5న జరుగుతుంది. ఈ పరీక్ష ఆంధ్రప్రదేశ్‌లో డైరక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పర్యవేక్షణలో జరుగుతుంది.
- పి.వి.ఆర్.కె. మూర్తి

(కటాఫ్ పర్సంటైల్ అంటే?   పునశ్చరణ అవసరం ఏమిటి?... వీటి కోసం eenadu.net లో చదువు విభాగం చూడండి.)

Saturday 8 December 2012

సివిల్స్‌ సమరానికి విభిన్న అస్త్రాలు




సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీలోని మొదటి పేపర్‌ పోటీపరీక్షలన్నిటిలోనూ సాధారణంగా కనపడేదే. ఈ సర్వీసుకు తగిన అభిరుచి అభ్యర్థుల్లో ఎంతమేరకు ఉన్నదో పరీక్షించేది రెండో పేపర్‌. ప్రిలిమినరీ విజయసాధనలో ఈ పేపర్‌ పాత్ర కీలకంగా మారింది. ఈ పేపర్‌ స్వభావం, తీరులను విశ్లేషిద్దాం!


విభిన్న పరిస్థితుల్లో అభ్యర్థుల ప్రతిభా సామర్థ్యాలను అంచనా వేసే రెండో పేపర్‌కు పకడ్బందీగా సిద్ధమవటం తప్పనిసరి. లేకపోతే మంచి స్కోరు సాధ్యం కాదు. ఏడు రకాల విభాగాలుండే ఈ పేపర్‌లో మొత్తం ప్రశ్నలు 80. ప్రతి సరైన జవాబుకూ రెండున్నర మార్కులు.

ఒక్కో విభాగాన్ని ఏ లక్ష్యంతో ప్రవేశపెట్టారో, సంసిద్ధమెలా అవాలో పరిశీలిద్దాం.

కాంప్రహెన్షన్‌

పాలనలో భాగస్వామిగా ఉండే అధికారి తన విధులు సక్రమంగా నిర్వర్తించాలంటే అవగాహన శక్తి ముఖ్యం. ఒక నిర్దిష్ట పరిస్థితిలోని ముఖ్యాంశాలను గుర్తించి విశ్లేషించగల సత్తా, తగిన నిర్థారణకు వచ్చే విజ్ఞతా ఉండాలి. నివేదికలూ, సమాచారం పరిశీలిస్తూనే కార్యాచరణకు ప్రణాళిక రూపొందించుకోవాలి.

రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ విభాగం ఈ నైపుణ్యాలను పరీక్షిస్తుంది. అభ్యర్థులకు 2-3 పేరాగ్రాఫులు ఇచ్చి బహుళైచ్ఛిక (మల్టిపుల్‌ చాయిస్‌) ప్రశ్నలకు జవాబులు రాయమంటారు.

ఇంటర్‌ పర్సనల్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌
పాలనాధికారుల విధుల్లో భావ ప్రసారానికి (కమ్యూనికేషన్‌) ప్రాముఖ్యం ఉంది. బృందంలో పనిచేయటం పెరిగిన ప్రస్తుత కాలంలో ఈ నైపుణ్యాలు పెంచుకుంటేనే విజయానికి దగ్గరవుతాము. ఉద్యోగుల్లో నిబద్ధత, పని సామర్థ్యం మెరుగుపరచటానికి సమర్థమైన భావప్రసారం చేయగలగాలి. ఆత్మవిశ్వాసం, సంబంధాల మెరుగుదల, ఇతరులకు ఆమోదయోగ్యమవటం... ఇవన్నీ సమర్థ కమ్యూనికేషన్‌ వల్లనే సాధ్యం. సివిల్‌ సర్వెంటుకు ఇది చాలా కీలకం.

ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పరం జరిగే భావాల ప్రసారాన్నే ఇంటర్‌ పర్సనల్‌ నైపుణ్యాలంటారు. భిన్న పరిస్థితుల్లో రకరకాల వ్యక్తులతో తగిన విధంగా వ్యవహరించి ప్రజలు నిశ్చింతగా ఉండేలా చేయగలగాలి. ఆలకించటం, మాట్లాడటం, ఘర్షణను నివారించటం- ఇవి ఈ నైపుణ్యాలతో సాధించే సాధారణ ఫలితాలు.

ఈ విభాగంలో ప్రశ్నలకు నెగిటివ్‌ మార్కింగ్‌ ఉండదు.
ఉదా:1. How would you best console a bereaved person?

a) Do not talk about the dead person for fear of causing pain. b) Give him a sedative on a regular basis after consulting a doctor. c) Instead of speaking give him a sympathetic touch. d) Offer help with the practical tasks and be prepared to listen. (Answer) 

లాజికల్‌ రీజనింగ్‌, ఎనలిటికల్‌ ఎబిలిటీ
ఆలోచనల పనితీరుపై ఆధారపడి మనుషులను మూడు రకాలుగా వర్గీకరించొచ్చు. 1) సరిగా, పొందికగా ఆలోచించలేనివారు 2) లోకజ్ఞానం, అనుభవం, తెలివితేటలు ఉపయోగించి నెగ్గుకువచ్చేవారు 3) దృఢంగా, తార్కికంగా ఆలోచించి ఇతరులకంటే శక్తిమంతంగా నిర్వహణ చేయగలిగేవారు. ఈ మూడో లక్షణమున్నవారే పాలనాధికారులుగా నేటి అవసరం.

ఈ నైపుణ్యాలను పరీక్షించేలాగానే ప్రశ్నలుంటాయి.

ఉదా:All big dams involve displacement of people and risk of serious harm to the ecology of the region. The claims of pro-big dam enthusiast cannot be sustained in terms of costs and benefits.

Assuming the truth of the passage, one can conclude from it that :

a) No big dam should ever be constructed whatever be the benefits arising out of it. b) All big dams from the very nature of its 'highness'destroy ecology or displace people. c) Big dam should only be undertaken provided it displaces the minimum number of people causes negligible damage to ecology and provide substantial benefits when completed. (Answer ) d) There are abundant alternatives to each water in scarcity areas such a way that , what big dams can offer, the alternatives can provide more efficiently at lesser cost.

డెసిషన్‌ మేకింగ్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌
ప్రైవేటురంగంలోని ఉద్యోగి తీసుకునే నిర్ణయం కంటే సివిల్‌ సర్వెంట్‌ తీసుకునే నిర్ణయాలు ఎక్కువమంది ప్రజలపై ప్రభావం చూపిస్తాయి. పరిస్థితుల మంచి చెడులను బేరీజు వేసి, సత్వర నిర్ణయాలు తీసుకోగలగాలి. వీరు తీసుకునే నిర్ణయాలన్నీ ప్రజలకు ఉపయోగపడాలి. ఇలాంటివారిని గుర్తించటం సివిల్స్‌ నియామకాల లక్ష్యం.

డెసిషన్‌ మేకింగ్‌కు సన్నిహితంగా అనుసంధానమైవుండేది ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌. సివిల్‌ సర్వెంట్లందరూ ఈ నైపుణ్యాలనుపెంపొందించుకునివుండాలి. సమస్యను దాని ఆనుపానులు గ్రహించి, అందులో భాగమైవున్నవారి సహకారంతో పరిష్కరించాలి.

పరీక్షలో ఊహాత్మక సందర్భాలను ఇచ్చి ఈ నైపుణ్యాలను పరిశీలిస్తారు. అత్యుత్తమ నిర్ణయాన్ని ఎంచుకుని, సమాధానంగా గుర్తించాల్సివుంటుంది. నెగిటివ్‌ మార్కులుండవు.

ఉదా:1. You are having dinner with your colleagues. Suddenly one of your colleagues starts choking. What would be your first reaction?

a) Reach for his throat around the voice box with your thumb and forefinger. b) Ask him 'are you choking' and see if he is able to reply. (Answer ) c) Ask him to leave the dining area immediately and go to the rest room. d) Try to help him cough so that the obstruction is cleared.

జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, బేసిక్‌ న్యూమరసీ
అందుబాటులో ఉన్న గణాంక సమాచారం ఆధారంగా పాలనాధికారులు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నారు. డేటా విశ్లేషణ ఆధారంగా సరైన సమాచారాన్ని ఉన్నతాధికారులకు నివేదించాల్సివుంటుంది.

ఈ విభాగంలో ప్రశ్నలు గ్రాఫులు, డయాగ్రమ్‌లు, సంకేతాలతో నిండివుంటాయి. యూపీఎస్‌సీ ప్రకారం మెంటల్‌ ఎబిలిటీ అనేది ఇంటలెక్చువల్‌ ఎబిలిటీ అని గ్రహించాలి.

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌ స్కిల్స్‌
సివిల్‌ సర్వెంట్లకు 'ఫంక్షనల్‌ ఇంగ్లిష్‌' పరిజ్ఞానం తగినంత అవసరమని అందరూ అంగీకరిస్తారు. అభ్యర్థి ఆంగ్ల భాషా నైపుణ్యాలను ఈ విభాగం పరీక్షిస్తుంది. కొన్ని పేరాలు ఇచ్చి మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలకు రాయమని అడుగుతారు. దీనికి సంబంధించి అభ్యాసాలకు పనికొచ్చే మెటీరియల్‌ విస్తృతంగానే లభ్యమవుతోంది.

పాత ప్రశ్నపత్రాలను విశ్లేషించి, తగిన వ్యూహం తయారుచేసుకోవాలి. దాన్ని దీక్షగా అమలుచేయాలి.


-  గోపాలకృష్ణ (డైరెక్టర్ , బ్రెయిన్ ట్రీ) 

(గత రెండేళ్ళ ప్రశ్నపత్రాల విశ్లేషణను eenadu.net చదువు విభాగంలో చూడండి).