ఉన్నత విద్యా సమాచారం * పోటీ పరీక్షల మెలకువలు * ఉద్యోగ నైపుణ్యాలు

విభాగాలు ఎన్ని?

Monday 30 April 2012

అభిరుచితో అందలం...ఇంజినీరింగ్‌


ఇంటర్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష ఎంసెట్‌కు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. తమ కుమారుడు / కుమార్తెను ఏ కోర్సులో చేర్చితే వారి భవిష్యత్తు బాగుంటుంది, విదేశాల్లో ఉపాధి అవకాశాలకు వీలుంటుంది అనే అంశాలపై తల్లిదండ్రులు ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. 


ప్రాంగణ నియామకాలు (క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌) జరుగుతున్న కళాశాలల గురించి తెలుసుకుంటూ, వాటిలో సీటు దక్కాలంటే ఏ స్థాయి ర్యాంకు సాధించాలో పిల్లలకు గుర్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల పర్యవేక్షణ, వారి ఆలోచనల మేరకు ఇంటర్‌ వరకు చదివినా... ఉపాధికి కీలకంగా భావిస్తున్న ఇంజినీరింగ్‌ విద్యలో మాత్రం విద్యార్థుల అభిరుచికి ప్రాధాన్యం తప్పనిసరిగా ఇవ్వాలని వివిధ రంగాల నిపుణులు పేర్కొంటున్నారు. సమీప భవిష్యత్తులో ఏ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభించవచ్చు? ఉన్నత జీవనానికి విద్యార్థి దశ నుంచే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఈ అంశాలపై దిగ్గజ కంపెనీల ఉన్నత స్థాయి ప్రతినిధులు ఏమంటున్నారు?

దేశ భౌగోళిక పరిస్థితులు, అత్యధిక జనాభా రీత్యా సదుపాయాల మెరుగుకు ప్రతి రంగంలోనూ టెక్నాలజీ వినియోగం పెరుగుతోంది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఐటీ ఆధారిత సేవారంగాలు (ఐటీఈఎస్‌), ఆటోమేషన్‌, టెలీ కమ్యూనికేషన్‌ వ్యాప్తి అధికమవుతోంది. ముఖ్యంగా ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ, ఆతిథ్య రంగాల్లో టెక్నాలజీ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు పాస్‌పోర్ట్‌ దరఖాస్తు కూడా ఇ-సేవాకేంద్రాల్లో చేస్తున్నామంటే టెక్నాలజీ విస్తృతి వల్లే. ఈ పరిణామాలు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు డిమాండ్‌ను పెంచుతున్నాయి. ఇతర రంగాల్లోనూ భవిష్యత్తులో ఉపాధి అవకాశాలకు కొరత ఉండదని నిపుణులు అంచనా వేస్తున్నారు.

* మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నందున సివిల్‌ ఇంజినీర్లకూ ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
* తయారీ రంగంలో మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ నిపుణుల అవసరం ఉంటుంది. ఏరోస్పేస్‌ రంగంలోనూ డిజైనింగ్‌ నిపుణులకు అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి.
* అన్ని రంగాల్లోనూ టెక్నాలజీ ప్రవేశం వల్ల కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఐటీ, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, సివిల్‌ వంటి కోర్సులు చదివిన వారు కూడా ఐటీ ఉద్యోగాల్లో ఇమిడిపోతున్నారు.
* రోజువారీ పనులను మొబైల్‌ సాయంతో చేయగలిగే టెక్నాలజీ, కంప్యూటర్‌ నిర్వహణ ఖర్చులు తగ్గించే క్లౌడ్‌ విస్తృతి పెరుగుతోంది. కాబట్టి ఐటీ రంగంలో రాబోయే 2 దశాబ్దాలలోనూ మంచి ఉపాధి అవకాశాలే లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఎలాంటి సామర్థ్యాలు కావాలి?
దేశంలోని ప్రధాన ఐటీ సంస్థలకు అత్యధిక ఖాతాదారులు విదేశాల్లో ఉంటారు. వారికి కావాల్సిన ప్రాజెక్టులను ఐటీ కంపెనీలు ఇక్కడే రూపొందిస్తుంటాయి. అందుకే ఐటీ ఉద్యోగుల్లో 80 శాతం మంది ఇక్కడ పనిచేస్తుంటే, 20 శాతం మంది ఖాతాదారులకు సమీపంగా విదేశాల్లో పనిచేస్తుంటారు. విదేశీ సంస్థలకు ప్రాజెక్టు చేస్తున్నప్పుడు, అక్కడి బాధ్యులతో సమాచారం ఇచ్చి, పుచ్చుకునే (కమ్యూనికేషన్‌) బాధ్యత ఆ ప్రాజెక్టు చేపట్టిన బృంద సభ్యులే వహించాలి. మనిషి ఎదురుగా ఉన్నప్పుడు మాట్లాడటం వేరు. వారి హావభావాలకు అనుగుణంగా స్పందించవచ్చు. కనీసం ఆ వ్యక్తి ఎలా ఉంటారో కూడా తెలీకుండా ఫోన్‌, ఇ మెయిల్‌, ఛాటింగ్‌ పద్ధతుల్లో సమాచార మార్పిడి జరగాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీడియో కాన్ఫరెన్స్‌ జరుగుతుంది. ఎదుటివారిని ఆకట్టుకునేలా కమ్యూనికేషన్‌ ఉండాలి. అందుకే భావ ప్రకటనా సామర్థ్యం ఐటీ రంగంలో అత్యంత ముఖ్యం.

* ఏం చేస్తున్నాము, ఇంకా ఏమి కావాలి అనే అంశాలను వివరంగా, తడబాటు లేకుండా విశ్లేషించగలగాలి. సాంకేతికంగా అభ్యర్థిలో ఎంత నైపుణ్యం ఉన్నా, చెప్పలేకపోతే ఫలితం ఉండదు.
* వ్యాకరణ దోషాలు లేకుండా ఇంగ్లిష్‌లో సమాచారాన్ని పంపగలగాలి.
* ఒక్కో ప్రాజెక్టు ఒక్కో దేశంతో చేయాల్సి రావచ్చు. జర్మనీ, జపాన్‌, అమెరికా.. ఇలా ఒక్కో దేశానికి ప్రత్యేక సంస్కృతి ఉంటుంది. అందుకు అనుగుణంగా వారితో మెలగాల్సి ఉంటుంది.
* జావా, ఎస్‌ఏపీ, డాట్‌ నెట్‌ లాంటి 20 రకాల కంప్యూటర్‌ లాంగ్వేజీలపై ప్రాజెక్టులు తయారు చేయాల్సి ఉంటుంది. ఇంజినీరింగ్‌లో అభ్యసించిన టెక్నాలజీతో పాటు ఎప్పటికప్పుడు కొత్త సామర్థ్యాలు నేర్చుకుంటూ ఉండాలి. కొత్త టెక్నాలజీలను త్వరగా గ్రహించగలగాలి.
* ఫలానా దేశం ప్రాజెక్టు వచ్చింది, వచ్చే వారంలో వెళ్లాలి అని కంపెనీ సూచించినప్పుడు, వెంటనే బయలుదేరగలగాలి. ఇంజినీరింగ్‌ దశలోనే దీనికి పునాది వేసుకోవాలి. సొంత ఇల్లు / బంధువుల వద్ద ఉంటూ రోజూ కళాశాలకు వెళ్లి వచ్చే వారికంటే, హాస్టల్‌లో ఉండేవారు కొత్తవారితో త్వరగా కలిసిపోతారని, ఎక్కడికైనా వెళ్లేందుకు సంకోచించరన్నది కంపెనీల అభిప్రాయం.
* దేశాలతో పాటు ఖాతాదారుల రంగాలు కూడా వేర్వేరుగా ఉండవచ్చు. బ్యాంకింగ్‌, తయారీ, టెలికాం, ఆరోగ్య సంరక్షణ, రిటైల్‌ వంటి రంగాలకు ప్రాజెక్టులు చేయాల్సి రావచ్చు. ఎలాంటి ఒత్తిడినైనా ఎదుర్కొని అప్పగించిన ప్రాజెక్టును విజయవంతంగా పూర్తిచేయగలగాలి. మనస్సు ప్రశాంతంగా ఉంటేనే ఇది సాధ్యం. విద్యార్థి దశ నుంచే దీనిపై దృష్టిపెట్టి వ్యక్తిత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి.

కళాశాలల పాత్ర కీలకం
వ్యక్తిగత మేథావితనం (బ్రిలియన్స్‌) కంటే ఒక బృందంగా విజయవంతం అయితేనే ఐటీ రంగంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. ప్రాజెక్టు పరిమాణానికి అనుగుణంగా ఒక్కో బృందంలో 5, 10, 50 మంది వరకు సభ్యులుగా ఉండవచ్చు. వీరంతా బృందంగా పనిచేస్తేనే ప్రాజెక్టు సక్రమంగా పూర్తవుతుంది. కళాశాలల్లో వ్యక్తిగత మూల్యాంకనానికే ప్రాధాన్యం లభిస్తోంది. ఈ పద్ధతిలో మార్పు అవసరం. కొన్ని కళాశాలలు మాత్రమే విద్యార్థులు బృందాల్లో పనిచేయడానికి అవసరమైన సామర్థ్యాలపై దృష్టిపెడుతున్నాయి.

ఎంతో ఒత్తిడి ఉండే ఐటీ ఉద్యోగంలో రాణించాలంటే మానసిక, శారీరక ఆరోగ్యం అత్యంత కీలకం. 20-30 ఏళ్ల వయస్సులో ఒత్తిడి తట్టుకుని పనిచేసినా, అనంతరం బీపీ, మధుమేహం వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. మొబైల్‌, ల్యాప్‌టాప్‌పై పనిచేస్తున్నందున, ఎక్కడ ఉన్నా విధులకు అందుబాటులో ఉంటారు. దీనివల్ల కార్యాలయ విధులు, ఇంటి బాధ్యతల మధ్య విభజన చెరిగిపోతోంది. 24 గంటలూ ఫోన్‌ / కంప్యూటర్‌కు అతుక్కుపోకుండా, వ్యక్తిగత జీవితానికి కూడా ప్రాధాన్యం ఉండే విధంగా ప్రణాళికను రూపొందించుకోవాలి. యోగా, వ్యాయామం లాంటి వాటికి సమయం కేటాయించాలి. ఆఫీసు, వ్యక్తిగత జీవితం, ఆరోగ్య సంరక్షణకు సరైన రీతిలో ప్రాధాన్యం ఇవ్వాలి. విద్యార్థి దశ నుంచే దీన్ని అలవరచుకోవాలి.

* రోజూ కనీసం 7 గంటలు నిద్రపోవాలి. విద్యార్థి దశలో రాత్రి 10-5 గంటల మధ్య నిద్రపోవాలి. విధుల్లో చేరాక నైట్‌షిఫ్ట్‌ ఉన్నా, అనువైన సమయంలో 7 గంటలు నిద్ర మానకూడదు.
* ఇంజినీరింగ్‌ నుంచే అభిరుచులను 1-2 అంశాలకు పరిమితం చేసుకోవాలి.
* మొబైల్‌, టీవీ, కంప్యూటర్‌ వినియోగించకుండా రోజులో కనీసం గంట లేదా అరగంట సమయం కుటుంబసభ్యులు లేదా సన్నిహితులతో నాణ్యంగా, ఆహ్లాదంగా గడపడం అలవర్చుకోవాలి.

కంప్యూటర్స్‌తో తేలిగ్గా ఉపాధి
బీఈ / బీటెక్‌ ఉత్తీర్ణతతోనే ఐటీ రంగంలో ఉపాధి పొందే అవకాశం ఉంది. మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, బయోటెక్నాలజీ వంటి రంగాల్లో అయితే మంచి కళాశాలల్లో పీజీ చేస్తేనే ఉన్నతోద్యోగాలు లభిస్తాయి. అందుకే ఇతర కోర్‌ సబ్జెక్టులు చదివిన అభ్యర్థులు కూడా చాలామంది ఐటీలో ఉపాధికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

* విదేశాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటం కూడా ఐటీ ప్రాధాన్యం పెరగడానికి మరో కారణం. ప్రారంభ వేతనాలు కూడా ఈ రంగంలోనే అధికం. కానీ ఇవే కీలకమని భావించి, విద్యార్థికి ఇష్టం లేకుండా కంప్యూటర్‌ సైన్స్‌ / ఐటీ కోర్సులో చేరితే ఇబ్బందులు ఎదురుకావచ్చు.
* వేగంగా విశ్లేషించగలగడం, సత్వర నిర్ణయాలు తీసుకునే చాతుర్యం, గణితంపై ఆసక్తి ఉన్నవారు ఐటీ రంగంలో రాణిస్తారు. కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ చదివిన వారికి ఈ రంగం అనుకూలిస్తుంది.

ఎంపిక పద్ధతులివీ...
ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరంలో జరిగే ప్రాంగణ నియామకాలతో పాటు కోర్సు పూర్తయ్యాక కూడా రాత పరీక్ష, బృంద చర్చ (గ్రూప్‌ డిస్కషన్‌), ఇంటర్వ్యూ ద్వారా కంపెనీలు తమకు కావాల్సిన అభ్యర్థులకు ఎంపిక చేసుకుంటున్నాయి.

* రాత పరీక్షలో ఇంజినీరింగ్‌ పరిజ్ఞానంతో పాటు లాజికల్‌, క్విక్‌ థింకింగ్‌, మ్యాథ్స్‌పై ప్రశ్నలుంటాయి. కొన్ని కంపెనీలు మాత్రం తమకు అవసరమైన టెక్నాలజీలో కనీస నైపుణ్యాలు ఉన్నాయో లేదో కూడా పరీక్షిస్తున్నాయి.
* ఇంజినీరింగ్‌లో నేర్చుకున్న అంశాలను ఎదుటివారితో ఎలా పంచుకుంటారనే విషయాన్ని పరీక్షించేందుకు బృంద చర్చ నిర్వహిస్తున్నారు.
* ఇంటర్వ్యూల్లో విద్యార్థులను టెక్నాలజీపై మరీ లోతుగా ప్రశ్నలు అడగరు. వారు చేసిన ప్రాజెక్టు వివరాలను ఆత్మవిశ్వాసంతో వివరించగలుగుతున్నారా లేదా అనేదే ముఖ్యంగా పరిశీలిస్తారు.

ఎంత శాతం మార్కులు అవసరం?
ప్రాంగణ నియామకాలు జరిగే వివిధ కళాశాలల్లో, అక్కడ ఎంపిక చేసుకునే విద్యార్థుల సగటు మార్కులు మారిపోతుంటాయి. కనీసం 65 శాతం మార్కులకు పైగా ఉన్నవారినే కంపెనీలు ఎంపిక చేసుకుంటున్నాయి.

దిగ్గజ కంపెనీలు ప్రాంగణ నియామకాలను అత్యున్నత విద్యాసంస్థలతో ప్రారంభిస్తాయి. ఐఐటీలు, ఐఐఎస్‌సీ, బిట్స్‌, నిట్‌, యూనివర్సిటీ ప్రాంగణ కళాశాలలు, పేరొందిన ప్రైవేటు కళాశాలలు.. ఈ క్రమంలో కళాశాలలకు వెళ్తాయి. ప్రైవేటు కళాశాలల ఎంపికలో, స్వతంత్ర సంస్థలు ఇచ్చే ర్యాంకులను, అక్కడి మౌలిక సదుపాయాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఏటా కొత్త కళాశాలలను జత చేస్తుంటారు.

* ఒక కళాశాల నుంచి ఎంపిక చేసిన విద్యార్థుల పనితీరును ఏడాది తరవాత పరిశీలిస్తారు. వారి పనితీరును ప్రామాణికంగా తీసుకుని, మరుసటి ఏడాది ఆయా కళాశాలల్లో ప్రాంగణ నియామకాలు జరపాలో, వద్దో నిర్ణయించుకుంటారు.


కంపెనీలు అభ్యర్థుల్లో  గమనిస్తున్న లోపాలు ....  www.eenadu.net లో చూడండి.

Thursday 26 April 2012

కొత్త కోర్సులతో మేనేజ్‌మెంట్‌కు మహర్దశ!


మేనేజ్‌మెంట్‌ కెరియర్‌పై ఆసక్తి గల ఇంటర్మీడియట్‌ / 10+2 విద్యార్థులకు రెండు కొత్త కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. అవి... 1. మేనేజ్‌మెంట్‌లో డ్యుయల్‌ డిగ్రీ 2. ఇంజినీరింగ్‌ / ఆర్కిటెక్చర్‌ / ఫార్మసీలతో కలిపి అందించే ఇంటెగ్రేటెడ్‌ మేనేజ్‌మెంట్‌ డిగ్రీ. ఈ కోర్సులకు 2012-13 విద్యా సంవత్సరం నుంచే అనుమతి ఇవ్వనున్నట్టు ఏఐసీటీఈ చైర్మన్‌ ఎస్‌.ఎస్‌.మంథా ఇటీవల ప్రకటించారు. అమెరికా, యూకేలలో ఇలాంటి కోర్సులు బాగా అందుబాటులో ఉన్నాయి. మనదేశంలో కూడా వీటికి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఏఐసీటీఈ చొరవ తీసుకోవడం శుభ పరిణామం

ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఇతర ప్రొఫెషనల్‌ కోర్సులతోపాటు మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు చాలా మెరుగవుతాయి. ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం... ఇంటర్‌/ +2 తర్వాత బీబీఏ + ఎంబీఏ డ్యుయల్‌ డిగ్రీ చేయవచ్చు. ఈ కోర్సులో మూడేళ్లు పూర్తిచేసినవారికి బ్యాచిలర్‌ డిగ్రీ, నాలుగేళ్లు చదివినవారికి అప్లయిడ్‌ మేనేజ్‌మెంట్‌ డిగ్రీ ఇస్తారు. ఈ డిగ్రీతో అవసరమైతే ఉద్యోగంలో చేరవచ్చు. కొన్నాళ్లు పనిచేసిన తర్వాత, రిజిస్ట్రేషన్‌ గడువులోగా మరో ఏడాది కోర్సు చేస్తే మాస్టర్స్‌ డిగ్రీ లభిస్తుంది.
ఈ కోర్సుల ప్రత్యేకతలు
విద్యార్థులు తమ ఆసక్తిని బట్టి విభిన్న కోర్సులు చేయడానికి ఏఐసీటీఈ నిర్ణయం వీలు కల్పిస్తుంది. మేనేజ్‌మెంట్‌ విద్యను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రూపొందించడానికి ఈ కోర్సులు ఉపయోగపడతాయి. ఈ కోర్సులకు కింది ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. అవి...

* నిర్దిష్ఠ కాలం తర్వాత కోర్సు నుంచి వైదొలగిన వారికి సంబంధిత డిగ్రీ వస్తుంది. ఉదాహరణకు డ్యుయల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లో మూడేళ్ల తర్వాత కోర్సు నుంచి వైదొలగితే బీబీఏ వస్తుంది.
* కోర్సు మధ్యలో వైదొలగినా, రిజిస్ట్రేషన్‌ వ్యవధి పూర్తయ్యేలోగా మళ్లీ వచ్చి మిగతా భాగాన్ని పూర్తిచేయవచ్చు.
* యూజీ నుంచి పీజీ కోర్సుకు వెళ్లడానికి ఎలాంటి ప్రవేశ పరీక్ష రాయాల్సిన అవసరం ఉండదు.
* రెండు డిగ్రీలు వేర్వేరుగా చేస్తే పట్టే సమయం, అయ్యే ఖర్చుకంటే తక్కువ వ్యవధి, ఖర్చుతో ఆయా డిగ్రీలను సాధించవచ్చు.

ఉన్నత విద్యను ప్రణాళికా బద్ధంగా చదవడానికి ఈ కోర్సులు ఉపయోగపడతాయి. ఖర్చులు, సమయం పరంగా చూస్తే ఆర్థికంగా వెనుకబడిన వారికి వీటివల్ల ప్రయోజనం ఉంటుంది.


బహుముఖ పరిజ్ఞానంతో భవిష్యత్తు
సమస్యను బహుముఖ దృక్పథం నుంచి ఆలోచించి పరిష్కరించాలంటే వివిధ సబ్జెక్టుల్లో పరిజ్ఞానం అవసరం. అందుకే మల్టీ డిసిప్లీనరీ కోర్సులకు భవిష్యత్తులో డిమాండ్‌ పెరగనుంది. ఇంజినీరింగ్‌/ ఆర్కిటెక్చర్‌/ ఫార్మసీతోపాటు మేనేజ్‌మెంట్‌ చదివిన వారికి ప్రత్యేక విలువ ఉంటుంది. అలాగే బీబీఏ-ఎంబీఏ ప్రోగ్రామ్‌ చేసిన అభ్యర్థులు సంపూర్ణ సామర్థ్యాలతో మేనేజర్లు అయ్యే అవకాశం ఉంటుంది. సబ్జెక్టును చాలాకాలం చదువుతారు కాబట్టి మేనేజ్‌మెంట్‌ సిద్ధాంతాలు, ఆచరణ, వృత్తిపై లోతైన అవగాహన ఏర్పరచుకోవచ్చు.

ప్రస్తుతం అందిస్తోన్న ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌ కోర్సులు సంబంధిత బ్రాంచిలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాయి. ఐదేళ్ల డ్యుయల్‌ డిగ్రీ, ఇంటెగ్రేటెడ్‌ కోర్సుల ద్వారా అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లను మరింత సమగ్రంగా తయారుచేయవచ్చు. మాస్టర్స్‌ డిగ్రీలో అందించే స్పెషలైజేషన్‌ అంశాలను ప్రణాళికా బద్ధంగా యూజీలో పొందుపరచడం ద్వారా మంచి కోర్సులు తయారవుతాయి. ఆర్నెళ్ల ఇంటర్న్‌షిప్‌ రూపంలో ఆన్‌ జాబ్‌ ట్రైనింగ్‌ అందించడం ఈ కోర్సుల మరో లక్ష్యం. సాధారణ పద్ధతిలో బీటెక్‌/ బీఫార్మ్‌, ఎంబీఏ చేయాలంటే ఆరేళ్లు పడుతుంది. డ్యుయల్‌ డిగ్రీ, ఇంటెగ్రేటెడ్‌ పద్ధతుల్లో ఐదేళ్లలోనే సమగ్రమైన నిపుణులను తయారు చేయడం వీలవుతుంది.

గ్రాడ్యుయేషన్‌ తర్వాత ఉద్యోగాల్లో చేరే అభ్యర్థులు కంపెనీల్లో రకరకాల టీమ్‌లు, బాధ్యతల్లో పాలుపంచుకుంటారు. ఈ నేపధ్యంలో నిర్వహణ సామర్థ్యాలు, నైతికత, విలువలు, క్రమశిక్షణ, తదితర అంశాలు చాలా కీలకంగా మారతాయి. డ్యుయల్‌ డిగ్రీలు, ఇంటెగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ల ద్వారా ఈ లక్షణాలను, సామర్థ్యాలను పెంపొందించుకోవచ్చు. ఒకదానికొకటి సంబంధం ఉన్న విభిన్న అంశాల్లో పరిజ్ఞానం గల అభ్యర్థులు కంపెనీలకు చాలా అవసరం. దీనితోపాటు అభ్యర్థి కెరియర్‌ ఆసక్తిని కూడా దృష్టిలో ఉంచుకొని పాఠ్యాంశాలను రూపొందించడం ఐదేళ్ల కోర్సుల్లో వీలవుతుంది.

మనదేశంలో డ్యుయల్‌ డిగ్రీలు
అమెరికా, యునైటెక్‌ కింగ్‌డమ్‌లలో డ్యుయల్‌ డిగ్రీ ఇంటెగ్రేటెడ్‌ కోర్సులు చాలా సంస్థల్లో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన అమెరికా విద్యాసంస్థలు స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, యేల్‌, డ్యూక్‌, కార్నెల్‌, న్యూయార్క్‌ యూనివర్సిటీలు, యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా, తదితర సంస్థలు మేనేజ్‌మెంట్‌లో డ్యుయల్‌ డిగ్రీ కోర్సులను అందిస్తున్నాయి. టెక్నాలజీ + మేనేజ్‌మెంట్‌, నర్సింగ్‌ + హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌, లా + మేనేజ్‌మెంట్‌ లాంటి కోర్సులు కూడా చాలా విదేశీ సంస్థల్లో అందుబాటులో ఉన్నాయి.

మనదేశంలో కూడా ఇటీవలి కాలంలో మాస్టర్స్‌, డాక్టొరల్‌ స్థాయుల్లో ఇంటెగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌లు ప్రారంభమయ్యాయి. అనేక ప్రైవేటు సంస్థలు వీటిని అందిస్తున్నాయి. అలాంటి కొన్ని ప్రోగ్రామ్‌ల వివరాలు...

* బిర్లా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (బిట్స్‌) పిలానీ మనదేశంలో డ్యుయల్‌ డిగ్రీ, ఇంటెగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌లను ప్రారంభించిన తొలితరం సంస్థ. ఈ ప్రోగ్రామ్‌ల ద్వారా బిట్స్‌ ప్రతిభావంతులైన విద్యార్థులను ఆకర్షిస్తోంది.

* నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్సిటీ బీఏ- ఎల్‌ఎల్‌బీ, బీకాం -ఎల్‌ఎల్‌బీ, బీబీఏ- ఎల్‌ఎల్‌బీ ప్రోగ్రామ్‌లను విజయవంతంగా నిర్వహిస్తోంది. ఈ కోర్సులు చేసినవారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి.

* ఐఐఎస్‌సీ బెంగళూరు, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఐఐటీ మద్రాస్‌, ఐఐటీ ఖరగ్‌పూర్‌, తదితర ప్రముఖ సంస్థలు డ్యుయల్‌ డిగ్రీ, ఇంటెగ్రేటెడ్‌ కోర్సులను అందిస్తున్నాయి.

* ఐఐఎంలలో ఐదేళ్ల ఇంటెగ్రేటెడ్‌ పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును మొదట ప్రారంభించిన సంస్థ ఐఐఎం -ఇండోర్‌. కంటెంట్‌ పరంగా ఇది మంచి ప్రోగ్రామ్‌.

* ఐఐటీ ఖరగ్‌పూర్‌, ఐఐటీ ముంబయి, ఎన్‌ఎంఐఎంఎస్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ లక్నో, వీఐటీ యూనివర్సిటీ, తదితర సంస్థలు ఇంటెగ్రేటెడ్‌ బీటెక్‌-ఎంబీఏ కోర్సును నిర్వహిస్తున్నాయి.

* అలహాబాద్‌ యూనివర్సిటీ కూడా ఇంటెగ్రేటెడ్‌ కోర్సులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. మిగతా రెగ్యులర్‌ యూనివర్సిటీలు కూడా ఇదో బాటలో నడిచే అవకాశం ఉంది.

సరైన సామర్థ్యాలు లేకపోవడం వల్ల సాధారణ గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు సాధించలేకపోతున్నారని పరిశ్రమలు ఎప్పటినుంచో అంటున్నాయి. ఏఐసీటీఈ ప్రకటించిన డ్యుయల్‌, ఇంటెగ్రేటెడ్‌ డిగ్రీలు ఈ సమస్యను కొంతవరకు పరిష్కరించే అవకాశం ఉంది. ఇంజినీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో లభించని అనేక సామర్థ్యాలు అభ్యర్థులకు ఈ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ల ద్వారా సమకూరుతాయి.

ఈ కోర్సుల ప్రయోజనాలూ, ప్రతికూలతల  గురించి www.eenadu.net చదువు విభాగంలో చూడండి.

Tuesday 17 April 2012

ఎంపీసీ విద్యార్థులూ... మీ కోసమే!


    ఎంపీసీ విద్యార్థులు ఒక్కొక్క ప్రవేశపరీక్షను పూర్తి చేసుకోవటంలో నిమగ్నమై ఉన్నారు. ఐఐటీ- జేఈఈ రాసిన అనుభవ సారాన్ని మిగతా పరీక్షలకు ఎలా అన్వయించుకోవాలి? పకడ్బందీగా ఏ విధంగా సన్నద్ధం కావాలి? పరిశీలిద్దాం!
త నాలుగైదు సంవత్సరాల పేపర్లతో పోలిస్తే ఉదయం జరిగిన ఐఐటీ-జేఈఈ పేపరు- 1 సులభంగా ఉంది. కానీ, మధ్యాహ్నం జరిగిన పేపరు - II ని అభ్యర్థులు క్లిష్టంగా భావించారు. దీంతో ఈ పోటీలో ఎక్కడ ఉంటామో అనే ఒక సందిగ్ధావస్థలో పడిపోయారు.

మొదటి పేపరు బాగా సులభంగా ఉంది కాబట్టి జేఈఈలో మరీ ఇంత సులభమైన ప్రశ్నలు ఇవ్వరని ఎక్కువగా ఆలోచించి కొన్ని తప్పులు చేశారు. అదేవిధంగా పేపరు - II బాగా క్లిష్టంగా ఉండటంతో అక్కడ కూడా అధికంగానే తప్పులు చేశారు.

ఈ పోటీ పరీక్షలన్నిటిలో ర్యాంకు సాపేక్షంగానే ఉంటుంది. పరీక్ష ఏ విధంగా ఉన్నా అభ్యర్థి వాటిని తీసుకునే పద్ధతి ఒకే విధంగా ఉండాలి. అప్పుడు ఇంకా జరగబోయే ఏఐఈఈఈ, ఐశాట్‌, బిట్‌శాట్‌ లాంటి పరీక్షల్లో కూడా అనుకొన్న ర్యాంకు సాధించే అవకాశం ఉంటుంది.

1. ప్రశ్న సులభంగా ఉంటే దానిని విపరీత అర్థాలు తీసి తప్పు జవాబులు గుర్తించకూడదు. ఉదా. భౌతికశాస్త్రంలో ఫిజికల్‌ ఆప్టిక్స్‌లో మొదటి పేపరులో ఇచ్చిన ప్రశ్న సాధారణ విద్యార్థి కూడా చాలా సులభంగా చేయగలది. దానిని అంత సులభంగా ఇవ్వరు, ఎక్కడో ఏదో మెలిక ఉంటుందని చాలామంది తప్పుగా గుర్తించారు.

అదేవిధంగా అకర్బన రసాయన శాస్త్రంలో పాఠ్యపుస్తకంలోని వ్యాఖ్యలను యథాతథంగా ఇచ్చినప్పటికీ చాలామంది తప్పు గుర్తించారు.

2. ఒక్కోసారి పేపరు కష్టంగా ఉందని అనిపించవచ్చు. 'ఇది సాపేక్ష పరీక్ష కాబట్టి మిగిలిన విద్యార్థుల కంటే ఒక ప్రశ్న అదనంగా చేయగలిగినా సీటు సాధించినట్లే' అనే దృక్పథంతో ఆలోచించాలి. ఇలా చేస్తే తప్పకుండా మంచి ర్యాంకు సాధించుకోవచ్చు.

ముందుగానే 'కటాఫ్‌' ప్రకటన
ఐఐటీ-జేఈఈ ప్రారంభమయిన తర్వాత ఫలితాల ముందే కటాఫ్‌ ప్రకటించడం అనేది తొలిసారి ఈ ఏడాదే జరిగింది. జనరల్‌ కేటగిరీలో సబ్జెక్టు కటాఫ్‌ 10 శాతంగా, మొత్తం కటాఫ్‌ మార్కులు 35 శాతంగా నిర్ణయించారు. ఓబీసీలో అయితే జనరల్‌ కేటగిరిలో 90 మార్కులు కటాఫ్‌గా, ఎస్‌.సి./ఎస్‌.టి./వికలాంగుల కేటగిరీ అయితే జనరల్‌ కేటగిరీ కటాఫ్‌లో 50 శాతం మార్కులు వీరి కటాఫ్‌గా ప్రకటించారు.



ప్రతి సబ్జెక్టులో 136 మార్కుల చొప్పున మొత్తం రెండు పేపర్లలో కలిపి 408 మార్కులకు పరీక్ష జరిగింది. ఈ కటాఫ్‌ మార్కుల పైన వచ్చిన ప్రతి అభ్యర్థికీ ర్యాంకు వస్తుంది. కానీ ఐఐటీలలో సీటు సాధించుకునే ర్యాంకు అంటే మాత్రం జనరల్‌ కేటగిరీలో 170 మార్కులపైనే సాధించవలసి ఉంటుంది.

ఏ మార్కుకు ఏ ర్యాంకు?
ఐఐటీ-జేఈఈలో సుమారుగా ఏ మార్కుకు ఏ ర్యాంకు వచ్చే అవకాశం ఉందో ఓ అంచనా ఇక్కడ చూద్దాం. ఇది కేవలం విద్యార్థి అవగాహన కోసమే కానీ కచ్చితమైన నిర్థారణ కాదు.



ఈ విశ్లేషణలో అర్థం చేసుకోవలసింది- పేపరు సులభంగా ఉంటే సీటు సాధించుకోవడానికి సాధించవలసిన మార్కు పెరుగుతుంది. పేపరు క్లిష్టంగా ఉంటే ఆ మార్కు తగ్గుతుంది. కానీ సాపేక్షంగా విద్యార్థి స్థాయి మారదు. ఈ విషయం అర్థం చేసుకుని పరీక్ష కాల వ్యవధిలో ఒక అవగాహనతో తెలిసిన ప్రతి ప్రశ్నకూ తప్పు లేకుండా సమాధానాలు గుర్తించగలగాలి. అప్పుడు పరీక్ష ఏదయినా కచ్చితంగా నెగ్గినట్లే!

ఏఐఈఈఈ సంగతి?
ఏఐఈఈఈ ఆన్‌లైన్‌లో ఏప్రిల్‌ 29నే కాబట్టి ఈ మిగిలిన పది రోజుల్లో కొత్త అంశాలను చదవడానికి ప్రాముఖ్యం ఇవ్వకూడదు. వీలైనన్ని నమూనా గ్రాండ్‌ టెస్టులు రాస్తుండాలి. ప్రతి పరీక్షలో చేసిన తప్పులు విశ్లేషించుకోవాలి.

ఈ పరీక్ష రాసే ప్రతి ఒక్కరూ మనసులో ఉంచుకోవాల్సిన అంశం- ప్రశ్నపత్రంలో అన్ని ప్రశ్నలకూ జవాబులు రాయాల్సిన అవసరం లేదు. నేర్చుకున్న అంశాలను తప్పు లేకుండా సక్రమంగా గుర్తించగలిగితే సరిపోతుంది.

*  అధికశాతం రెండో సంవత్సర సిలబస్‌లోనే ప్రశ్నలు వచ్చే అవకాశముంది. అందుకే ద్వితీయ సంవత్సర సిలబస్‌కు సమయం ఎక్కువ కేటాయించుకుంటే మేలు.
*  ఆన్‌లైన్‌లో పరీక్షకు దరఖాస్తు చేసివున్నట్లయితే వీలైనన్ని నమూనా పరీక్షలు కంప్యూటర్‌పై అభ్యాసం చేయాలి. 65 శాతం పైన మార్కులు సాధించగలిగితే మంచి ఎన్‌.ఐ.టి.లో సీటు సాధించినట్లే!


బిట్ శాట్ సంసిద్ధమయ్యే  తీరు తెలుసుకోవడానికి  ఈ వారం ఈనాడు ‘చదువు’ ఇంటర్నెట్ ఎడిషన్ చూడండి-    http://archives.eenadu.net/04-16-2012/Specialpages/chaduvu/chaduvuinner.aspx?qry=topstory1

Thursday 12 April 2012

పీజీలో ప్రవేశానికి ఇవీ పరీక్షలు

    రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంట్రన్స్‌ పరీక్షల నోటిఫికేషన్‌లు వెలువడ్డాయి.

మొత్తం 25 రాష్ట్ర స్థాయి ప్రభుత్వ యూనివర్సిటీలు ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సెట్‌)ల ద్వారా పీజీ, పరిశోధన కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తున్నాయి. శ్రీవేంకటేశ్వర, ఓయూ, ఏయూ, కాకతీయ యూనివర్సిటీలు తమ పరిధిలోని ఇతర యూనివర్సిటీలకు కూడా పరీక్షలను నిర్వహిస్తున్నాయి. క్యాంపస్‌ కాలేజీలతోపాటు వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో సీట్లను కూడా ఈ ఎంట్రన్స్‌ల ఆధారంగా భర్తీ చేస్తారు.

ఉస్మానియా యూనివర్సిటీ గతవారం పీజీసెట్‌ నోటిఫికేషన్‌ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలోని దాదాపు అన్ని యూనివర్సిటీలు పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సులకు ప్రకటనలు విడుదల చేసినట్లయింది. ఆంధ్ర, శ్రీవేంకటేశ్వర, నాగార్జున, కృష్ణా, ఉస్మానియా, నన్నయ యూనివర్సిటీలు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాయి. ఈ నెల 26న ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించే ఆసెట్‌ పరీక్ష జరగనుంది. అప్పటి నుంచి జూన్‌ చివరి వరకు వివిధ యూనివర్సిటీలు పీజీ ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నాయి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అకడమిక్‌ పరీక్షలు పూర్తయిన వెంటనే పీజీ ఎంట్రన్స్‌లకు సిద్ధం కావాలి.

బేసిక్‌ సైన్సెస్‌, ఆధునిక బయాలజీ, లాంగ్వేజెస్‌ (ముఖ్యంగా ఇంగ్లిష్‌) కోర్సుల్లో ప్రవేశానికి విద్యార్థుల నుంచి పోటీ ఎక్కువగా ఉంటోంది. బేసిక్‌ సైన్సెస్‌లో కెమిస్ట్రీ, మేథ్స్‌, ఫిజిక్స్‌; ఆధునిక బయాలజీలో బయో కెమిస్ట్రీ, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, నానో టెక్నాలజీ, మెటీరియల్‌ సైన్స్‌, తదితర సబ్జెక్టులకు ఆదరణ ఎక్కువగా ఉంది. మిగతావాటితో పోల్చుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ సైన్సెస్‌లో చాలా స్పెషలైజేషన్లు అందిస్తోంది.
 


క్యాంపస్‌ కాలేజీల్లో...
రాష్ట్ర యూనివర్సిటీల్లో ఎంఏ, ఎం.ఎస్‌సి., ఎం.కాం, ఎంసీఏ, ఎంబీఏ, ఇంటెగ్రేటెడ్‌ పీజీ కోర్సులతోపాటు ఎం.ఫిల్‌., పీహెచ్‌డీ పరిశోధన కోర్సులు ఉన్నాయి. పీజీసెట్‌ల ద్వారా ఎం.ఎ., ఎం.ఎస్‌సి., ఎం.కాం., ఇంటెగ్రేటెడ్‌ పీజీ, తదితర కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. మిగతా కోర్సులకు విడిగా ప్రవేశ పరీక్షలు ఉంటాయి. సైన్సెస్‌, ఆర్ట్స్‌, కామర్స్‌ సబ్జెక్టుల్లో పీజీ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తున్నాయి. మంచి మౌలిక సౌకర్యాలు, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ అందుబాటులో ఉండే యూనివర్సిటీ కాలేజీలు, ప్రముఖ ప్రైవేటు కాలేజీల్లో సీట్లు సాధించాలంటే సంబంధిత సబ్జెక్టులో ఉత్తమ ర్యాంకులు తెచ్చుకోవాల్సిందే. క్యాంపస్‌ కాలేజీల్లో మంచి లైబ్రరీలు, ఇంటర్నెట్‌ సౌకర్యం, ఇంకా ఉన్నత కోర్సులకు, పోటీ పరీక్షలకు సిద్ధమవడానికి అవసరమైన పుస్తకాలు, గైడెన్స్‌ అందుబాటులో ఉంటాయి.

* పీజీ ఎంట్రన్స్‌లలో విజయం సాధించాలంటే అభ్యర్థులకు సబ్జెక్టులోని ప్రాథమిక అంశాలపై మంచి అవగాహన తప్పనిసరి. తాము ఎంచుకున్న సబ్జెక్టులో ఇంటర్మీడియట్‌ స్థాయిలోని అంశాల నుంచి ప్రిపరేషన్‌ మొదలుపెట్టాలి.

* తర్వాత డిగ్రీ పాఠ్యాంశాలను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. తద్వారా సబ్జెక్టులో ప్రాథమిక అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. వీటిని అప్పుడప్పుడు పునశ్చరణ చేస్తుండాలి. వివిధ అంశాలను అన్వయించడం నేర్చుకోవాలి. డిగ్రీ చదివేటప్పుడే పీజీ ఎంట్రన్స్‌లపై అవగాహన పెంచుకుంటే లక్ష్యసాధన సులువవుతుంది.

ప్రవేశ పరీక్షల తీరు...
దాదాపు అన్ని యూనివర్సిటీలు ఎం.ఎస్‌సి. ప్రవేశ పరీక్షలను ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ చాయిస్‌ పద్ధతిలోనే నిర్వహిస్తున్నాయి. యూనివర్సిటీ లైబ్రరీల్లో ప్రవేశ పరీక్షల గత ప్రశ్నపత్రాలు లభించవచ్చు. నగరాల్లోని ప్రముఖ బుక్‌షాప్‌లలో కూడా ప్రయత్నించవచ్చు. ఎం.ఎస్‌సి. ఎంట్రన్స్‌లకు సిద్ధమయ్యే అభ్యర్థులు ముందుగా ప్రశ్నపత్రాల స్వరూపం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. వివిధ అంశాలకు లభిస్తోన్న ప్రాధాన్యాన్ని అవగాహన చేసుకోవాలి. బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, జెనెటిక్స్‌ సబ్జెక్టుల ప్రశ్నపత్రాలు సాధారణంగా ఇంగ్లిష్‌లోనే ఉంటాయి. అందువల్ల అభ్యర్థులు ఇంగ్లిష్‌లో ఉండే నమూనా ప్రశ్నపత్రాలను సాధన చేయడం మంచిది. కెమిస్ట్రీ ప్రశ్నపత్రం సాధారణంగా తెలుగులో కూడా ఇస్తారు.

* ఉస్మానియా యూనివర్సిటీ ఎం.ఎస్‌సి. బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, జెనెటిక్స్‌, ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ కోర్సులకు కలిపి ఒకే పరీక్షను నిర్వహిస్తోంది. దీనిలో కెమిస్ట్రీ పేపర్‌ అందరికీ కామన్‌గా ఉంటుంది. బీఎస్సీలో చదివిన ఏదైనా ఒక బయాలజీ ఆప్షనల్‌ను అభ్యర్థులు ఎంపిక చేసుకోవాలి. బయాలజీ విద్యార్థులు తాము ఎంచుకున్న స్పెషలైజేషన్‌, కెమిస్ట్రీలో మంచి మార్కులు తెచ్చుకుంటే సీటు సాధించవచ్చు. కామన్‌ ఎంట్రన్స్‌లో మంచి ర్యాంకు సాధిస్తే తమకు ఇష్టమైన స్పెషలైజేషన్‌లో ఎం.ఎస్‌సి. చేయవచ్చు.

* ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించే ఎం.ఎస్‌సి. బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ ఎంట్రన్స్‌ పరీక్షల్లో బయాలజీ సబ్జెక్టుకు వెయిటేజీ ఎక్కువగా ఉంటుంది. ఏయూ ఎం.ఎస్‌సి. ఎంట్రన్స్‌లలో నెగటివ్‌ మార్కులు ఉంటాయి. అందువల్ల కచ్చితమైన సమాధానం తెలిస్తేనే జవాబు గుర్తించడం మంచిది.

* ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించే మైక్రోబయాలజీ, కాకతీయ యూనివర్సిటీ నిర్వహించే బయోటెక్నాలజీ ఎంట్రన్స్‌లలో సాధారణంగా కెమిస్ట్రీ ప్రశ్నలు అడగరు.

* ఎం.ఎస్‌సి. కెమిస్ట్రీ ఎంట్రన్స్‌ రాయబోతున్న విద్యార్థులు గమనించాల్సిన విషయం ఏమిటంటే... గత ఏడాది నుంచి బీఎస్సీ కెమిస్ట్రీ 4వ పేపర్‌ సిలబస్‌ను ఎంట్రన్స్‌ పరీక్షల సిలబస్‌కు కొత్తగా చేర్చారు. దీనిలో మెటీరియల్‌ సైన్స్‌, గ్రీన్‌ కెమిస్ట్రీ, మాలెక్యులార్‌ స్పెక్ట్రోస్కోపి, పెరిసైక్లిక్‌ చర్యలు, డ్రగ్స్‌, పెస్టిసైడ్స్‌, సపరేషన్‌ టెక్నిక్స్‌, తదితర అంశాలు ఉంటాయి.

* ఎస్వీయూ, ఎస్కేయూ, యోగి వేమన, పద్మావతి, రాయలసీమ, విక్రమ సింహపురి, ద్రవిడియన్‌ యూనివర్సిటీల్లో ప్రవేశానికి నిర్వహించే ఎస్వీయూఆర్‌పీజీసెట్‌ బాధ్యతను ఈ ఏడాది శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ తీసుకుంది.

యూనివర్సిటీల పరిధిలో వివిధ సబ్జెక్టులకు ఉన్న పోటీని బట్టి చూస్తే, కనీసం 60 నుంచి 70 శాతం మార్కులు సాధించిన వారికి ఆయా కోర్సుల్లో సీట్లు లభించే అవకాశం ఉంటుంది. డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న విద్యార్థులు రోజూ కనీసం 6-7 గంటలు శ్రమించడం తప్పనిసరి. యూనివర్సిటీల్లో స్థానిక విద్యార్థులకు 85 శాతం, నాన్‌ లోకల్‌ విద్యార్థులకు 15 శాతం సీట్లు కేటాయిస్తారు. అభ్యర్థులు తమ లోకల్‌ యూనివర్సిటీలకు ప్రాధాన్యం ఇస్తే సీటు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

* తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నిర్వహించే పీజీ కోర్సుల్లో అన్ని ప్రాంతాల విద్యార్థినులు ప్రవేశం పొందవచ్చు. యూనివర్సిటీ నిబంధనలను అనుసరించి నిర్దిష్ట నిష్పత్తిలో అన్ని ప్రాంతాల అభ్యర్థులకు సీట్లను కేటాయిస్తారు.

హెచ్‌సీయూ, ఇఫ్లూలలో పీజీ
రాష్ట్రంలోని ప్రముఖ సెంట్రల్‌ యూనివర్సిటీలు... యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ (హెచ్‌సీయూ), ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ) కూడా పీజీ నోటిఫికేషన్‌లు విడుదల చేశాయి. ఇవి రెండూ జాతీయ స్థాయిలో అత్యుత్తమ సంస్థలుగా పేరుపొందాయి. హెచ్‌సీయూలో సైన్సెస్‌లో కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, బయోకెమిస్ట్రీ, మేథ్స్‌, ఏనిమల్‌ బయోటెక్నాలజీ, ప్లాంట్‌ బయోటెక్నాలజీ, తదితర పీజీ కోర్సులున్నాయి. కొన్ని కోర్సులకు రాతపరీక్షతోపాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ప్రవేశం లభించిన విద్యార్థులు అందరికీ ఫెలోషిప్‌ లభిస్తుంది. ఇఫ్లూలో ఇంగ్లిష్‌, ఇతర విదేశీ భాషల్లో పీజీ చేయవచ్చు. ఆయా సంస్థల్లో ఎం.ఫిల్‌., పీహెచ్‌డీ సీట్లను కూడా ఈ నోటిఫికేషన్‌ల ద్వారానే భర్తీ చేస్తారు.

 - ఎస్. కిరణ్ కుమార్